Saturday, March 6, 2021

అమ్మ

దీనజనావని...
పతితపావనీ...
అమ్మలగన్న అమ్మవు...
ముజ్జగాలకే ముత్తయిదువవు...
నిత్యసుమంగళి నీవేనమ్మా...
దుర్గివై మా మదిలో నిల్చినావు...
దిక్కు చూపవే తల్లీ....

ఓం శ్రీమాత్రే నమః
ఓం దుర్గాదేవియే నమః

శివోహం

నాలోనే నీవు కానీ చూడలేను....
నా చుట్టూ నీవు కానీ కనిపెట్టలేను.....
వెతుకులాడి వెతుకులాడి వేసారితిని.....
ఒక్కసారి కనిపించవా శివ...
నీ ఒడిలో ఒదిగే వరమీయవా హర.. 

మహాదేవా శంభో శరణు...

శివోహం

సద్గురువు అమ్మ 
భగవంతుడు నాన్న


నాలుగైదు నెలల పిల్లవాడు. మంచం మీద పడుకోబెట్ట బడి ఉన్నాడు. ఇంకా నిలబడటం,నడవటం రాని వాడు.
ఇక మంచం దిగే యోచనే తెలియని వాడు. ప్రక్కనే పడక్కుర్చీ లో నాన్న పుస్తకమేదో చదువుకుంటున్నాడు.

ఇంతలో పిల్లవాడు మల మూత్రాలు విడిచాడు. ఆ పొత్తిగుడ్డ ల్లోనే గుండ్రంగా పొర్లాడు. బోర్లా,వెల్లకిలా పడ్డాడు. ముక్కూ మొహమూ ఏకం చేసుకున్నాడు. బురద లో చేప పిల్ల లా తప తప కొట్టు కున్నాడు. చివరికి తన మురికి తనే భరించ లేక కెవ్వుమని ఏడుపు లంకించుకున్నాడు.

పిల్ల వాడి ఏడుపు విని నాన్న దగ్గరి కొచ్చాడు.
పిల్ల వాడు చేతులు పైకెత్తి ఎత్తుకోమన్నట్లుగా తండ్రి వైపు చూస్తూ క్యారు క్యారు మన్నాడు.

మల మూత్రాలు ఒళ్ళంతా పుసుకుని దుర్గంధ భూయిష్టం గా ఉన్న కొడుకుని నాన్న చూశాడు, గానీ ఎత్తు కోలేదు.
అంతలో పిల్లాడి ఏడుపు విని అమ్మ కూడా పరిగెట్టు కొచ్చింది.
” ఏమోయ్! వాడు చూడు! ఎలా ఉన్నాడో!?ఒంటి నిండా పెంట పూసుకున్నాడు!” అన్నట్లుగా చూసాడు నాన్న!
అమ్మని చూసి మరింత గట్టిగా ఏడుస్తూ చేతులు చాపాడు పిల్ల వాడు.
అమ్మ… నాన్నలా దూరంగా ఉండి పోలేదు.
ఒక్క ఉదుటున వచ్చి ఎత్తుకుంది.
స్నానాల గదికి తీసికెళ్ళి పీటేసుకు కూర్చుంది.
చీర కుచ్చిళ్ళు మోకాళ్ళకి పైకి లాక్కుని, పిల్లాణ్ణి కాళ్ళ పైనేసుకుంది.

నీళ్ళూ,సున్ని పిండీ వేసి.. చేపని రుద్దినట్టు రుద్ది కడిగింది.
పొడి తువ్వాలు పెట్టి ఒళ్ళంతా తుడిచింది. పరిమళాలు విరజిమ్మే గంధపు పొడులేవో రాసింది. బొట్టూ,కాటుకా పెట్టింది.
ఉతికిన జుబ్బా తొడిగింది. బుగ్గన కాసంత దిష్టి చుక్క పెట్టి,ఎత్తి ముద్దులాడింది.

పిల్లవాడు ఏడుపు ఆపి కిల కిల నవ్వుతుండగా తెచ్చి నాన్న చేతికిచ్చింది. చదువుతున్న పుస్తకం అవతల పెట్టి, కొడుకు నెత్తుకుని నాన్న…

” నా తండ్రే! నా బంగారు కొండే!..” అంటూ.. ముద్దులాడాడు.
పిల్ల వాడు పరమానందం లో మునిగి పోయాడు.
భగవంతుడు నాన్న లాంటి వాడు! మనం మురిగ్గా ఉంటే ఎత్తుకోడు, దగ్గరకి రాడు, రానివ్వడు. సద్గురువు అమ్మ లాంటి వాడు. 

మన దోషత్రయాన్ని [మల విక్షేప ఆవరణ లు]దూషించడు.
మన ఈషణ త్రయాన్ని [దార ధన పుత్ర ] చూసి ఈసడించడు.
వాసనాత్రయాన్ని[లోక దేహ శాస్త్ర ] చూసి వద్దకు రావద్దని వారించడు.

మన అహంకారాన్ని చూసి అసహ్యించు కోడు. ఓపికగా మన చిత్తాన్ని శుధ్ధి చేసి మన అహంకరాన్ని అణచి వేసి,
వాసనల్ని వదలగొట్టి ఈషణ,ఈర్ష్యాసూయల్ని దాటించి
నిర్మల,విశుధ్ధుల్ని చేసి భగవంతునికి ప్రీతిపాత్రులమయ్యేట్లుగా చేస్తాడు.

ఎందుకంటే….
తారతమ్య సాంద్రత సమం కానిదే ఒక పదార్ధం మరో పదార్ధం లో కలసిపోదంటుంది భౌతిక శాస్త్రం.

బ్రహ్మమెంత నిర్దోషమో… అంత నిర్మలమైతే తప్ప బ్రహ్మస్వరూపులం కాలేమంటూంగి గీత!

ఇహైవ తైర్జిత స్సర్గః,యేషాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ,తస్మాద్బ్రహ్మణి తే స్థితాః॥

అందుకే మరి…..
ఎవరెంతగా అన్నా
ఎవరెంతగా విన్నా,
ఎంత చదివినా,
ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా,
సద్గురువుని ఆశ్రయించటం తప్పనిసరి…
అంటారు అనుభవజ్ఞులు.

రచన: కళ్ళెం. సుబ్రహ్మణ్య శర్మ

Friday, March 5, 2021

శివోహం

శివ!!!నీ లీలలు అద్భుతం తండ్రి...

కష్టాల్లో ఉన్న నీ భక్తులందరిని ఒకే తాటిపై తీసుకు వస్తావు...

ఉన్న బంధాన్ని తెంచుతావు...
లేని బంధాన్ని కలువుతావు...

ఒకటి తిస్తావు...
తీసినదానికి ఇంకోటి జత చేస్తావు...
నీ లీలలు తెలియ నా తరమా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ పాదాల చెంత  నేను 
మారేడుదళం లా నో లేక
ఒక్క క్షణం ని ముందు ఇలా దీపంలా వెలిగిన భాగ్యమే  కాదా తండ్రి...

మహాదేవా శంభో శరణు... 

శివోహం

*భగవంతుని చూద్దాం పడండి*

ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు- “రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇట్లా అన్నాడు- “భగవన్, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖసంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే- మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి. వారికి దర్శనాన్ని ఇవ్వండి.”

 భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు... ” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుదల బట్టి “ఈ కోరికను తీర్చ వలసిందే.” అన్నాడు భగవంతుడు చివరకు భక్తుడి ముందు వంగక తప్పలేదు. 

ఆయన అన్నాడు- “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు నగరంలో దండోరా వేయించాడు. “రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు వచ్చి చేరవలసింది. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు.”

 రెండవ రోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరిని సమాధానపరచి,

“అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణ్యాల ఆశలో పడి మీ అదృష్టాన్ని కాల తన్ను కోకండి.” అన్నాడు.

కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో అనుకున్నారు- మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము. భగవంతుడిని తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని.

 రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేల మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’

 ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్లి పోయారు.

 ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు- “చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో! భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే.” నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. 

వారిద్దరూ ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది.
అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.

  నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు-

 “ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచి ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.”

రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు-

 “ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు.”

 ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

ఓం నమః శివాయ



ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా, ఒక పులిని చూసి పారిపోసాగింది. పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. 

ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న పులి కూడా ఆ తమకంలో ఆ బురదగా ఉన్న చెరువులో దూకేసింది. ఆ రెండు ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న చెరువులో,  ఎంత ఒకదాని మీద ఒకటి పడ్డా.. ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.

పులి ఆవుని చూసి, ” ఇప్పుడు నీ ఎముకలు పరపరా నమిలేయాలని ఉంది ” అన్నది.

ఆ పులి ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమైంది. ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయురాలైంది.

అప్పుడా ఆవు పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా? అనడిగింది

పులి , ” ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే !! నువ్వెందుకు అలా అడుగుతున్నావు. నాకు నేనే కదా యజమానిని ” అని గర్వంగా గర్జించింది.

అప్పుడా ఆవు ” నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా” అన్నది

పులి..  నీ పరిస్థితి అంతే కదా !! నువ్వు ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా !! ఆకలితో చస్తావు కదా ” అన్నది.

అప్పుడా ఆవు ” నేను చావను. ” అన్నది.





” ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువైన నిన్ను ఎవరు రక్షిస్తారు ” అన్నది పులి.

” నిజమే !! నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా స్వామి నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో నేను ఇంటికి చేరక పోవడంతో నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు. ” అని మధురంగా, మెల్లగా చెప్పింది.

పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.

సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీశాడు. దానిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. కానీ దాని దురహంకారం దానిని వారిని దగ్గరకు చేరనివ్వలేదు.

మనం ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, ఆవు శరణాగతి చేసినవాడికి ప్రతీక.

 పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. 

యజమాని గురువు లేదా మన స్వామి. బురద మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆకర్షణలు, పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.

జీవిత పోరాటం అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపొతున్నప్పుడు , ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ”నేనున్నాను” అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి అన్ని బంధాలనుండి విముక్తులను చేసి మోక్షం ప్రసాదిస్తాడు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...