Monday, April 5, 2021

శివోహం

*సోమవారం శివారాధన అత్యంత ఫలప్రదం* 

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి ( తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి ). తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి.సాయంత్రం వరకు ఉపవాసము ( పాలు , పండ్లు వంటివి తీసుకోవచ్చు ) ఉండి , శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి .

2. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

*🌿🌼🙏శివాభిషేకం చేయిస్తూ ఉండండి ఎటువంటి కష్టాలైనా భస్మమవుతాయి 🙏🌼🌿,*

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...