Sunday, December 6, 2020

హరే క్రిష్ణ

ఎన్ని మారులు పాడిన
వన్నె తరగదు నీ పాటకు

ఎన్ని మారులు విన్నా నీ మురళి స్వరాలకు
వన్నెలేమి తరగవు కదా!

మరచిపోవాలన్నా ఓ మాధవా!
మరపురాదు నీ పేరు!

విడిచిపోవలన్నా వీడిపోదు
విడవని భందం మనది ఏనాటిదో!

తీయని నీ మురళినాదం
తీపిదనం కురిపిస్తుందిప్పుడు!

నర్తన చేస్తుందిప్పుడు నా యదలో!
నవ్య సుందరములను వెలువరిస్తూ

అందుకే అర్పిస్తున్నా ఆత్మార్పణమని!
ఆవేదనతో నీ మధుర గీతాలను!

యుగ యుగలునాటి నీ మధుర పదాలు!
తర తరాలునాటిదీ హృదయ వేదన!

Saturday, December 5, 2020

శివోహం

శంభో...
కన్నతండ్రిలా నన్ను ఆదరిస్తున్నావు... 
కృతజ్ఞతగా నీకు ఏమీవ్వగలను....
ఇవ్వడానికి నాదంటూ ఏముంది దేవా....
ఉంది నీవే...
ఉన్నది నీదే... 
మహాదేవా శంభో శరణు...

Friday, December 4, 2020

అయ్యప్ప

శబరి గిరీషుడు...
శంకర తనయుడు...
జ్యోతి స్వరూపుడు...
భూలోక నాథుడు నా మణికంఠుడు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

ఓం

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం...
రచన: జి.సందిత

మానవులు జన్మను సార్థకం చేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే!
అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము.
కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేకపోవటమే!
ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం. అప్పుడు వండి సిద్ధం చేయటం, వడ్డించటం శరీరకర్మ.
అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం వాచా కర్మ.
అలా చేస్తున్నందుకు తృప్తిపడుతూ ఆనందించటం మానసిక కర్మ.
అటువంటి పూర్ణ ధర్మాచరణమే దైవప్రీతమైన కార్యమన బడుతుంది. ఇలా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే కర్మాచరణంతో ముడివడిన ధర్మాచరణం సంపూర్ణసార్థక్యం చెందుతుంది.
ఇచ్చట మనసే ప్రధానమైనది. మనసులో అయిష్టత వైరుధ్యం వున్నప్పుడు, వండటంలోనూ, వడ్డించటంలోనూ భోజనానికి పిలవటంలోనూ, కొసరటంలోనూ, మాటల్లోనూ తృప్తిగా ఆనందించటంలో, మనసులోనూ భోజనం పరిమాణం, రుచులు, నాణ్యతలలోను ప్రభావం కనిపించవచ్చు.
అటువంటి ధర్మాచరణ మానవులదృష్టిలో ధర్మ కార్యమనబడవచ్చును కాని దైవం మెచ్చదు. దైవ ప్రీత్యర్హమైన ధర్మాచరణం ఒకచో — విధ్యుక్త ధర్మం- స్వీయకర్తవ్యం కావచ్చును. ఐనప్పటికిని అది పూజలు వ్రతాలకన్నను, జపతపాదికాలకన్నను, యజ్ఞహోమాదికాలకన్నను అత్యంతపవిత్రమైనదై దైవాన్ని మెప్పిస్తుంది.
ముఖ్యంగా వృత్తిరీత్యా దీనులను ఆదుకునే స్థానంలో కర్తవ్యాన్ని, విధ్యుక్తధర్మాలను నిర్వహించే వారైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ఇతరత్రా స్వయంగా అటువంటి బాధ్యతలు నిర్వహించే వారైనా తమకు ప్రాప్తించిన అధికారాన్ని, వృత్తినైపుణ్యాన్ని దేవుడు మనకు ఇచ్చిన వరంగా ప్రసాదించిన మహిమగా భావించాలి.
ఆ విధంగా మనకు తన మహిమల్ని మనకు ఇచ్చి — మనుషుల దైన్యాలను దూరం చేసే అవకాశాన్ని మనకు ఇచ్చాడని గ్రహించాలి.
ఆ విధంగా మనుషులకు సేవ చేస్తూ దేవునికి దేవుని కృపకు దీనులను మరింత చేరువచేస్తూ భగవంతుణ్ణి మనం మెప్పించ గలగాలి. అప్పుడే మన జన్మసార్థకమౌతుంది.
దీనులంటే రోగములచే గాని ఇతరత్రా కష్టములచే గాని పీడింపబడుతూ భగవంతుని శరణువాడే వారే కదా! వారు బాధలనుండి రక్షిస్తారన్న ఆశతో—వైద్యులవద్దకు కాని, సంబంధిత అధికారుల వద్దకు గాని వస్తూవుంటారు.
అలా బయలుదేరుతూ వారు–
“దేవుడా! మేము వెళ్ళిన చోట ఆ వైద్యులు లేదా అధికారులు సిద్ధంగా వుండేట్లు చూడు. వాళ్ళు వెంటనే మా బాధల్ని తొలగించేట్లు చూడు” అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తారు. అలా కష్టాలు తీరితే–
” దేవుని దయవల్ల సులభంగా మాకు మేలు జరిగింది” అని దేవుణ్ణి తలుచుకుంటారు.
దేవుడు కూడా —
“ఫలానా వ్యక్తికి వైద్యునిగా లేదా అధికారిగా విధులునిర్వర్తించే అవకాశం శక్తి మహిమ ఇచ్చినందు వలన లోకానికి మంచి జరిగింది “అని భావిస్తాడు.
ఆ విధంగా విధ్యుక్తధర్మం, కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేవారికి మరో జన్మలో కాని అదే జన్మలో గాని ఇంకా మంచి వృత్తినైపుణ్యాలను, అధికారాలను ప్రసాదిస్తాడు దేవుడు.
దేవుడు అటువంటి వారికి అత్యున్నత స్థితులను కల్పిస్తూ ఇహలోక సంబంధమైనమైన అష్టైశ్వర్యాలను, స్వర్గసుఖాలను కల్పిస్తాడు. అటుపై ఏకంగా అటుపై మోక్షప్రాప్తినిస్తాడు.
అందుకు విరుద్ధంగా కర్తవ్యాలను విస్మరించే వారు దీనులకు తటస్థిస్తే దీనులు దిక్కుతోచక “దేవుడా నీవు దీనబాంధవునివని నిన్ను ప్రార్థించి బయలుదేరితిమే. ఎందుకు ఇలా చేసితివి తండ్రీ! నీ దయ మాపై చూపలేదేమి ”
అంటూ దేవునితో మొఱ పెట్టుకుంటారు.
దయతో ప్రసాదించిన విద్యావకాశములచే ఉద్యోగావకాశములచే దీనుల కష్టాలనుతీర్చే శక్తిని మహిమను అధికారములను పొందిన వారు –ధర్మాన్ని మరచిపోయిన ఫలితంగా మరుజన్మంటూ వుంటే వారికి దైవీయమైన పై నైపుణ్యాలను అధికారాలను ఎట్టి పరిస్థితులను ప్రసాదించడు.
దైన్యం అంటే ఏమిటో వారికి అర్థం అయ్యేలా అటువంటి కర్తవ్యద్రోహులకు దీనాతి దీనులుగా జన్మను ప్రసాదించి తనను ప్రార్థించి తనకు చేరువై దీనజన రక్షణావశ్యకతను గుర్తించేలా అనుగ్రహిస్తాడు.
మానవులమైన మనమైనా మనకు చెడ్డపేరు తెచ్చిపెట్టే కన్నబిడ్డలకైనా అధికారాలను బాధ్యతలను అప్పగించలేము కదా!
*** ** ***
దీనబాంధవుడైన భగవంతుని ప్రీత్యర్థం కర్తవ్యపాలనంలో భాగమైన విధ్యుక్త ధర్మాల్ని త్రికరణశుద్ధిగా నెరవేర్చటం మన ధర్మం. అదే మానవధర్మం కూడానూ.

అయ్యప్ప

శబరి గిరీషుడు...
శంకర తనయుడు...
జ్యోతి స్వరూపుడు...
భూలోక నాథుడు నా మణికంఠుడు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

శివా ! భక్తవత్సలా...
మానవులనే కాదు...
మూగజీవుల భక్తిని మెచ్చి మోక్షమిచ్చిన ఓ శంకరా...
పరమ దయామయా నీవే నాకు దిక్క...

మహాదేవా శంభో శరణు...


శివోహం

రచన: రాజన్

సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి,
జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ.
భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన పరిణామానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం నువ్వనే వాడివి అసలు లేవని, భ్రమకు మరో పేరే భగవంతుడని వాదిస్తున్నారు. పురాతన గ్రంధాలను, తత్వ శాస్త్రాన్ని అవపోసన పట్టిన పండితుల మాటలను నమ్మాలో..లేక అపర సృష్టికర్తలైన శాస్త్రవేత్తల మాటలు విశ్వసించాలో తెలియడం లేదు. అందుకే నా మొదటి ప్రశ్న…‘ నువ్వనే వాడివి ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? ‘
ఇక నా రెండవ ప్రశ్న…నువ్వనే వాడివి ఉంటే నీకు ఇష్టమైన వారెవరు? నీ నామమే స్మరిస్తూ జనారణ్యానికి దూరంగా ఉండే మునులా? రోజూ నీకు కొబ్బరికాయలు, అరటిపళ్ళు సమర్పించి గంటల కొద్దీ పూజలు చెసే సామాన్య భక్తులా? కోట్లు కొల్లగొట్టి లక్షలు నీ హుండీ లో వేసే ధనిక భక్తులా? లేక జనానికి ధర్మోపన్యాసాలిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నవీనతరం స్వామీజీలా? ఇంకో చిన్న అనుబంధ ప్రశ్న ప్రభూ…నిన్ను నమ్మని వారంటె నీకు కోపమా?
ధర్మం నశించినప్పుడు, అధర్మం ఉరకలేస్తునప్పుడు అవతరిస్తూనే ఉంటానని గీతలో గోవిందునిగా చెప్పావు. కానీ ఇప్పుడు ధర్మం నశించిపోలేదంటావా? పదవుల కోసం, ఆస్తుల కోసం సొంతవారినే చంపుకుంటున్నారు. కుల, మతాల పేరుతో ఒకరినొకరు ఊచకోతలు కోస్తున్నారు. విద్యా, వైద్యశాలలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ప్రతి మనిషిలోనూ వికృతత్వం తాండవిస్తుంది. కేవలం ఒకరిద్దరు రాక్షసులను చంపడానికి, కొంతమంది భక్తులను రక్షించడానికి ప్రతీ యుగంలోను జన్మిస్తుంటావని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇంతమంది రాక్షసులున్న ఈ యుగంలో ఎందుకు నువ్వింకా జన్మించలేదు? ఇది నా మూడవ ప్రశ్న.
దయామయా… నా ప్రశ్నల్లో అజ్ఞానం ఉంటే మన్నించు. కానీ నిరంతరం నాలోను, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వేదన భరించలేకున్నాను. సృష్టిలో అత్యధికుల విశ్వాసానికి ప్రతిరూపానివైన నీవు మాత్రమే నాలోని ఈ అలజడిని తగ్గించి, శాంతిని ప్రసాదించగలవని భావించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
సౌగుణ్యశీలి అయిన జగన్మాతకు నా నమస్కారములు తెలియజేయి.
నీ జవాబు కోసం ఎదురు చుస్తూ,
భూలోక చరుడు,
మానవుడు

*************

భగవంతుని జవాబు
కుమారా,
నీవు వ్రాసిన “భగవంతునికి లేఖ” ప్రతి అందింది. సృష్ట్యాది నుండి తపస్సులు, పూజలు, ప్రార్ధనలు, బలిదానాలు వంటి విధానాల ద్వారా మాత్రమే ఇంతవరకూ నేను భక్తుల కోర్కెలను, సందేహాలను తీరుస్తూ వచ్చాను. వీటికి భిన్నంగా ఒక లేఖ ద్వారా నా అస్థిత్వానికి, పరమాత్మ తత్వానికి సంబందించిన సమాధానాలు తెలుసు కోవాలనుకున్న నీ ఆలోచన నన్ను ఆకర్షించింది. అందుకే సృష్టి చరిత్రలో మొదటిసారిగా నా స్వహస్తాలతో నీ లేఖకు సమాధానం వ్రాస్తున్నాను. సమాధానాలు చిత్తగించు.

నీ మొదటి ప్రశ్న: “నువ్వనే వాడివి ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు?” అన్నది నా అస్థిత్వానికి సంబందించినది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎందరో పండితులను, భక్తులను, శాస్త్రవేత్తలను ప్రశ్నించానన్నావు. కానీ ఇంతమందిని సమాధానం అడిగిన నీవు విచిత్రంగా నిన్ను నువ్వు మాత్రం ప్రశ్నించుకోవడం మరచిపోయావు. బాహ్య ప్రపంచం అన్నది నిలకడలేనిది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, ఒక సమాజం నుండి మరో సమాజానికి దాని స్వభావం మారిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా అంగీకరించే ఏక సిద్ధంతాలంటూ ఏమీ లేవు. ఈ పండితులు, శాస్త్రవేత్తలందరూ తమ చుట్టూ ఉన్న సమాజం నుండి, తమకు ఎదురైన అనుభవాల నుండి కొన్ని సిద్దాంతాలను ఏర్పరచుకొని అవి మాత్రమే నీకు చెప్పగలరు. మరి అలాంటప్పుడు వేల సిద్దాంతాలలో ఏదో ఒకదానిని పట్టుకు వేలాడే వాళ్ళకు మూల పదార్ధమైన నా గురించి ఎలా తెలుస్తుంది. నన్ను తెలుసుకోవడనికి, చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అంతర ప్రపంచంలోనికి ప్రయాణించడం. అలా తమలోకి తాము ప్రయాణం చేస్తున్న వారినే ఙ్ఞానులంటారు. ఙ్ఞానమన్నది ఓ నిరంతర ప్రయాణం. ఙ్ఞానమంటే సర్వమూ తెలిసిఉండటం కాదు. ఆ సర్వమూ తనలోనే ఉందని తెలుసుకోవడం. అలాంటి ఙ్ఞానులకు విగ్రహాలతోను, సిద్దాంతాలతోను పనిఉండదు. దేవుడు ఉన్నాడా లేడా అనే మీమాంసకు వారి మనసులో తావులేదు. ఇదే నీ మొదటి ప్రశ్నకు సమాధానం: దేవుడనే వాడు నిశ్చలానందంలోనూ, సర్వవ్యాపకత్వాన్ని గ్రహించగలిగే హృదయాంతరాళంలోను ఉన్నాడు. మరోలా చెప్పాలంటే “నువ్వే నేనై ఉన్నాను”.
ఇక నీ రెండవ ప్రశ్న: “నువ్వనే వాడివి ఉంటే నీకు ఇష్టమైన వారెవరు?”. నిజానికి నీ మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే నీ మిగతా రేండు ప్రశ్నలకి సమాధానాలు సులభంగానే దొరుకుతాయి. అయినా నీ ప్రతి ప్రశ్నకు జవాబిద్దామనే ఉద్దేశ్యంతో వీటికి కూడా జవాబిస్తున్నాను. మునులు, ధనిక భక్తులు, బీద భక్తులు, ధర్మోపన్యాసాలిచ్చే గురువులు…వీరిలో నాకు ఇష్టమైన వారెవ్వరని అడిగావుకదా…విను… సృష్టికి అందాన్ని తేవడానికి, సృష్టి కార్యక్రమం సజావుగా జరగడానికి పగలు రాత్రి, ఎండా వానా, వేడీ చలీ అనే పరస్పర విరుద్ధ భావనలను సృజించాను. ఆ తరువాత నాలోనే మంచి చెడు, ఆనందం దుఖం లాంటి గుణాలను పుట్టించుకొని మానవునిగా మారాను. ఈ గుణాలను తొలగించుకుంటే మళ్ళీ దేవుడైపోతాను. అంటే మానవుడినైనా దేవుడినైనా నేనే… గుణాలే తేడా. మునులు, మూర్ఖులు, మహాత్ములు, బూటకపు స్వామీజీలు, ఆస్థికులు, నాస్తికులు వీళ్ళంతా నేనే. నీకంటికి నేను ఇన్ని రూపాలలో కనిపిస్తూ ఉండటం వల్ల నీకీ సందేహం వచ్చింది. నా మొదటి సమాధానం ద్వారా ఒక్క సారి నువ్వు నేనై చూడు. అంతా ఒకేలా కనిపిస్తుంది. ఇక నీ అనుబంద ప్రశ్న “నిన్ను నమ్మని వారంటే నీకు కోపమా?”. భగవంతుడు అనబడే నేను ఒక నమ్మకం…. నేను నమ్మిన వారి నమ్మకం లోనే కాక నమ్మని వారి నమ్మకం లోను ఉంటాను. ఇక నాకు నచ్చని వారనే ప్రశ్న ఎక్కడ ఉంది.
చివరిదైన నీమూడవ ప్రశ్న: “ఇంతమంది రాక్షసులున్న ఈ యుగంలో ఎందుకు నువ్వింకా జన్మించలేదు? “. ఇది బ్రహ్మ రహస్యం, కానీ చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. ప్రతీ యుగానికి కొన్ని యుగ లక్షణాలుంటాయి. పూర్వయుగాలలో రాక్షసులనే వారిని ప్రత్యేకించి సృష్టించి వాళ్ళను చంపడానికి రాముడుగా, కృష్ణుడుగా పుడుతూ వచ్చాను. కానీ కలియుగానికొచ్చేసరికి ఈ రాక్షసులను బయట కాక ప్రతీ మనిషి మస్తిష్కంలోనూ పుట్టించాను. భయం, ద్వేషం, అలసత్వం ఈ రాక్షసులలో ప్రముఖులు. వీరిని సంహరించడానికి ధైర్యం, ప్రేమ అనే రూపాలలో అదే మస్తిష్కంలో పుట్టే ఉన్నాను. కావలసిందల్లా యుద్ధం మొదలుపెట్టి ఆ రాక్షసులను చంపడమే. ఇదే నీ ఆఖరి ప్రశ్నకు సమాధానం: “నేను ఇప్పటికే నీ మస్తిష్కంలో జన్మించి ఉన్నాను”.
నీ సందేహాలు నివృత్తి అయ్యాయి కదా. మానవునిగా ప్రశ్నించి భగవంతునిగా సమాధానం చెప్పావు. ప్రశ్నించడం మొదలైంది అంటే దైవంగా మారడానికి నీ ప్రయాణం మొదలైందన్నమాట. ఙ్ఞానం పై మెట్టు అయితే ప్రశ్న మొదటి మెట్టు. ఇక నుండి ప్రతి ప్రశ్నని ప్రశ్నించు. ఆ వచ్చిన జవాబునీ ప్రశ్నించు. తలపెట్టిన ప్రతికార్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి పూర్తిస్తాయిలో యత్నించు. మానవుని పరిపూర్ణరూపమే భగవంతుడనే సత్యాన్ని ప్రపంచానికి చాటించు.

శుభం భూయాత్

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...