Monday, March 13, 2023

నిజమైన భక్తి

నిజమైన భక్తి భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం... అన్నీ భక్తికి నిదర్శనాలే.
భక్తి అనేది ఓ మధురమైన భావన.
భగవంతుడి కోసం తన అనుకున్న సర్వస్వాన్నీ అర్పించటమే భక్తి.
నిజమైన భక్తి అనుభవైకవేద్యమైనదే తప్ప ఇదీ అని చెప్పగలిగేది కాదు.
అందుకే నిజమైన భక్తుడు నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు.

భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం… అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. కలిమి లేముల్లో, సుఖదుఃఖాల్లో… ఒకటేమిటి ప్రతిస్థితిలో, ప్రతి అవస్థలో, అన్ని వ్యవస్థల్లో, అంతటిలో భగవంతుడిని చూడగలగడమే భక్తి. అనుక్షణం అణువణువునా పరమాత్మను హృదయంలో దర్శించడం భక్తి అవుతుంది. భగవంతుడిని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.

తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటారు. మంత్రాలు పఠిస్తారు. పూజలు, జపాలు చేస్తారు. ఇంకొంతమంది కోరికలు నెరవేరడానికి ఉపవాసాలు ఉంటుంటారు. వ్రతాలు చేస్తుంటారు. ఇవన్నీ భక్తి కలిగిన వారు చేసే వివిధ సాధనా మార్గాలు మాత్రమే. అంతేకానీ పరిపూర్ణ భక్తికి ప్రతీకలు మాత్రం కావు. భగవంతుడిని ఆరాధించే కొద్దిసేపైనా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే అసలైన భక్తి అవుతుంది. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతుడికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే.

భగవంతుడిని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుడిని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివుడిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవంతుడి తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది.

భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవటం కాదు. ముడుపుల పేరుతో దేవుడితో లావాదేవీలు జరపడం అంతకన్నా కాదు. ఇవన్నీ కేవలం సాధనా మార్గాలు మాత్రమే. కోర్కెల గురించి మాత్రమే సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునేవారికి అసలు భక్తితత్వం బోధపడలేదని తెలుసుకోవాలి. పరమాత్మ సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి సర్వవ్యాపకుడికి మన కోర్కెలు తెలిపి, ‘ఇదీ నా ఫలానా అవసరం, దాన్ని తీర్చు’ అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా! మనతోపాటు, మన భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..?

భగవంతుడిపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. మరి భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెబుతారు? అనే ప్రశ్న ఉదయించినప్పుడే ఆలోచన, సాధన మొదలవుతాయి. అవే క్రమంగా పరిశోధనగా మారతాయి. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు విశ్వజిత్‌ అనే యాగం చేస్తూ అందులో భాగంగా అనేక దానాలు చేస్తుంటాడు. తండ్రి చేస్తున్న దానాల్ని గమనించిన నచికేతుడు ‘నాన్నా! నన్ను ఎవరికి దానం చేస్తావు?’ అని అడిగాడు. యాగ పనులతో తీరికలేకుండా ఉన్న వాజశ్రవుడు పిల్లవాడి మాటలకు విసుగెత్తి ‘నిన్ను యముడికి దానం ఇచ్చాను’ అన్నాడు. వెంటనే నచికేతుడు తనను తాను సమర్పించుకునేందుకు యముడి వద్దకు వెళ్లాడు.

యముడు పిల్లాడిని చూసి ముచ్చటపడి మూడు వరాలు ఇస్తానంటాడు. అందులో ఒక వరంగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమంటాడు నచికేతుడు. పసిబాలుడు ఊహించని వరం కోరేసరికి ఆశ్చర్యపోతాడు యముడు. అనేక ఆశలు చూపించి అతని దృష్టి మరల్చాలని చూస్తాడు. కానీ, నచికేతుడు దేనికీ లొంగడు. తన ప్రశ్నకు సమాధానం కావాలని పట్టుబడతాడు. బాలుడి పట్టుదలకు సంతోషించిన యముడు అతడికి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. అదే కఠోపనిషత్తుగా అవతరించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నది. ఇలా తెలుసుకోవాలన్న తపన ప్రశ్నించిన భక్తుడితోపాటు మనందరినీ తరింపజేసింది.

భగవంతుని పొందడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలా తొమ్మిది రకాల మార్గాలు సూచించారు. ఇవే నవవిధ భక్తిమార్గాలుగా ప్రసిద్ధి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంతిమంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. నిర్మలమైన భక్తికి భగవంతుడి అందదండలు ఉంటాయి. నిశ్చలమైన భక్తుడికి స్వామి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది.

దేవుణ్ని ప్రశ్నిస్తే…?

భక్తి ఉన్నంత మాత్రాన ప్రశ్నించకూడదనేమీ లేదు. ప్రశ్నకు తగిన సమాధానం దొరికితే భక్తి మరింత పెరుగుతుంది. కార్యకారణ సంబంధాలను విశ్లేషించిన తరువాత ఏర్పడే భక్తిలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కొడుకుకు ఏదైనా సందేహం వస్తే తండ్రిని ప్రశ్నిస్తాడు కదా! అనుమానం నివృత్తి చేసుకుంటాడు కదా! మరి జగత్తుకు తండ్రి అయిన దేవుడిని ప్రశ్నిస్తే మాత్రం తప్పేముంది. దేవుడు కూడా తనను నిలదీసే భక్తులను ఎక్కువ అనుగ్రహిస్తాడు. కత్తి పదునుతేలాలి అంటే సానబెట్టాలి. భక్తికీ అంతే! ఆటవికుడైన తిన్నడు పరమశివుడిని అంత తేలిగ్గా నమ్మలేదు. ‘అసలు నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు. ‘నీ జాడ ఎక్కడ?’ అని నిలదీశాడు. భగవంతుడి జాడను తెలుసుకున్నాకే విశ్వసించాడు. పరమ భక్తుడిగా మారాడు. భాగవతం రాసిన పోతనామాత్యుడు పరమ భాగవతోత్తముడు. అయితేనేం. ఆయన దేవుడి గురించి బోలెడన్ని ప్రశ్నలు సంధించాడు.

డా॥ కప్పగంతు రామకృష్ణ

మాయాశక్తి.. చైతన్య దీప్తి!

శిష్యుడు: గురువు గారూ! ‘ఈశావాస్య మిదగ్‌ం సర్వమ్‌’ అంటారు కదా! మరి ఈశ్వరుడు ఎల్లెడలా ఎలా కొలువై ఉన్నాడో వివరిస్తారా?

గురువు: నాయనా! ఈశ్వరుడు ఎల్లెడలా ఎలా ఉన్నాడని తెలుసుకునే ముందు అసలు ఈశ్వరుడు అంటే ఎవరో అర్థం చేసుకోవాలి. ఈశ్వర పదానికి ఈట్‌/ ఈశ అనే పర్యాయపదాలు ఉన్నాయి. ఈశాన అంటే ఒక విషయాన్ని అదుపులో ఉంచుకోవడం, పెత్తనం చెలాయించడం! ఈ చరాచరసృష్టికి బాహ్యంగా, ఆంతర్యంగా చేరి దానిని తన వశంలో ఉంచుకొని నడుపుతున్నది ఈశ్వరుడే! అంతర్యామి అని కూడా ఆయనకే పేరు.


‘ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే’ అని భగవద్గీత చెబుతున్నది. తన మాయాశక్తిని ఆధీనంలో ఉంచుకొని సృష్టి, స్థితి, లయాదులు చేస్తున్న వాడే ఈశ్వరుడు. ఇదంతా ఈశ్వరుడి చేతే వాసితం అయి ఉన్నది. కాబట్టి ఈ విశ్వాన్ని ఈశ్వర భావనతోనే చూడమని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతున్నది.

ఈశ్వరుడికి, పరమాత్మకు ప్రత్యేక లక్షణాల ద్వారా ఆయాపేర్లు సూచించారు మన ఉపనిషత్‌ కర్తలు. పరమాత్మ వేరు, ఈశ్వరుడు వేరు. నిర్గుణ తత్వాన్ని పరమాత్మగా, ఆత్మగా, బ్రహ్మగా పేర్కొనాలి. అదే ఆత్మ సగుణమై జగన్నాటకం నిర్వహిస్తే ఈశ్వరుడిగా చెప్పాలి. మనం అనుభవిస్తున్న మాయాశక్తి నిర్గుణంలో గుప్తమై ఉంటుంది. గుప్తమై ఉన్న శక్తి ఈశ్వరుడిలో ప్రకటనమై, అతనికి అధీనమై సృష్ట్యాదులు సాగిస్తున్నది. ఇది మనం గ్రహించవలసిన రహస్యం.

శిష్యుడు: గురువు గారూ! అంటే ఈశ్వరుడు, ఆత్మ ఒకటే అంటారా?

గురువు: అవును! ఆత్మ రూపంలో కనిపించకుండా ఉన్న అనంతమైన శక్తిలో కొంతభాగం మాయాశక్తిగా పరిణమించడంలోనే విభూతులన్నీ ఉనికిలోకి వస్తున్నాయి. ఈ విభూతులన్నీ మన కంటికి కనిపిస్తున్నా.. ఇవన్నీ మాయాశక్తితో రూపుదిద్దుకున్న మాయా రూపాలే!

శిష్యుడు: గురువు గారూ! ఈ మాయాశక్తి వివిధ విభూతులలో ఎలా నిక్షిప్తమై ఉంది? దానిని కనుగొనడం ఎలా?

గురువు: నాయనా! సూర్యరశ్మిలో ఉష్ణోగ్రత కనిపించదు. ఆ ఉష్ణాన్ని ఆవరించి ఉన్న రశ్మి మాయాశక్తే! అదే సూర్యుడిలో శక్తిని ప్రజ్వలింపజేసే సంలీనశక్తి కూడా మాయే! ఇంకా చెప్పాలంటే నీలో ఉత్పన్నమయ్యే ఉష్ణశక్తీ, కండరాలు కదిలించగలిగే శక్తీ, జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని కరిగించే ఆమ్లశక్తీ, రక్తాన్ని పరుగులెత్తించే చోదకశక్తీ అన్నీ మాయాశక్తే! చివరికి మనలో చైతన్యాన్ని ప్రేరేపించే ప్రాణశక్తి కూడా మాయాశక్తే!!

శిష్యుడు: ఒక్క మాయాశక్తి ఇన్ని రూపాల్లో ఎలా ప్రకటితమవుతుంది గురువు గారూ!

గురువు: దానికి కారణం ఆత్మే! అంతరిక్షంలోకి సాలోచించి సుదీర్ఘంగా చూడు. ఈ విభూతులన్నీ ఆకాశంలో ఎంతో వేగంగా తిరుగుతున్నా ఒకదానితో మరొకటి ఢీకొనడం లేదు. అలా ఢీకొనకుండా ఉంచుతూ, వాటిని మన ఊహకు అందని వేగంతో తిప్పే శక్తే ఈ విభూతులుగా ప్రకటితమవుతుంది. అంటే ఆ అనంతశక్తి ఈశ్వర తత్వంలో ఏకకాలంలో ఇటు విభూతులుగానూ, అటు వీటన్నిటినీ అదుపులో ఉంచే శక్తిగానూ తన విద్యుక్తధర్మాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. అదే మాయాశక్తి ఏకకాలంలో వివిధ శక్తులుగా అంతర్గతంగా ఉంటూ, అదేకాలంలో బహిర్గతమవుతూ తన వైచిత్రిని చాటుతున్నది. అందుకే అది మాయాశక్తి, ఇదంతా మాయా ప్రపంచం.

శిష్యుడు: గురువు గారూ! ఇదంతా వింటుంటే, అంతా అర్థమైనట్టుగానూ, ఏమీ అర్థంకానట్టుగానూ ఉంది. అందుకేనేమో ‘ఆశ్చర్యవత్‌ పశ్యతి కచ్చిదేనం..’ అని గీతాచార్యుడు ప్రకటించాడు. ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు డార్క్‌ ఎనర్జీ, క్వాంటం ఫిజిక్స్‌ అనే శాస్ర్తాలుగా అధ్యయనం చేస్తూ ఆశ్చర్యపోతున్నారు!!

…రావుల నిరంజనాచారి

Sunday, March 12, 2023

శివోహం

శివా!నీ నామం నలుగుతోంది నాలికపై
నీ తేజం వెలగుతోంది విశ్వ వేదికపై
ఓ రూపం దాల్చవా నీ రూపం తెలియగ
మహేశా . . . . . శరణు .

Saturday, March 11, 2023

శివోహం

శివా!నీ పాదాల నలుగినా నీ నాట్యమే చూస్తున్నా
అణిగిందిలే అహమని ఆనందం పొందుతున్నా
అణగద్రొక్కినట్టున్నా అనుగ్రహంగా తెలుసుకున్నా
మహేశా . . . . . శరణు .

*సాక్షాత్కారం అంటే ఏమిటి?*

*సాక్షాత్కారం అంటే ఏమిటి?* 

ఆధ్యాత్మికమైన విషయాలు ప్రత్యక్షంలోకి వస్తే దాన్నే సాక్షాత్కారమంటారు. ఆధ్యాత్మిక విషయాలంటే ఆత్మ పరమాత్మలకు సంబంధించిన విషయాలు, నిర్దిష్టంగా చెప్పాలంటే ఇంద్రియాతీత ప్రత్యక్షజ్ఞానాన్ని సాక్షాత్కారమని అనాలి. 

కాదు మానసిక సాక్షాత్కారమే, సాక్షాత్కారమని కొందరు, మనస్సు సంబంధం కూడా పోయిన తరువాతే సాక్షాత్కారం కలుగుతుందని కొందరు అంటారు. 

భౌతిక ప్రపంచమే తమ పరిధిగా గల సాధకులు కొందరు అద్భుత శక్తులను ప్రదర్శిస్తూంటారు. వారిది ఇంద్రజాలం అనిపించుకుంటుందే తప్ప 'సాక్షాత్కారం' అనిపించుకోదు. అది ఒక వ్యసనంలాంటిది. 

ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందినవారు. భౌతిక ప్రయోజనాలు కలిగించలేరా అంటే ప్రత్యేకించి కలిగించాలని వారు ప్రయత్నం చేయరు కాని వారి సన్నిధే సమస్త శుభాలు కలిగిస్తుంది. 

తమ ఆపదల్ని గట్టెక్కించమనో, వ్యక్తిగత ప్రయోజనాల్ని కూర్చమనో వచ్చిన వారిని కూడా ఆ దివ్యసాధకుడు పో, పొమ్మని నిరాశపరచడు. మంత్రమో, స్తోత్రమో ఉపదేశించి, ఆచరణకు మార్గదర్శనం చేస్తాడు. ఫలితాన్ని భగవంతుడి ఇచ్ఛకే వదులుతాడు. 

ఉపనిషత్తుల ప్రకారం, భగవదనుగ్రహం వుంటే సాక్షాత్కారం కలుగుతుంది. దానికి గురువుగారి ఉపదేశం వుండాలి. ఆ ఉపదేశాన్ని సాధకుడు అనుసరించాలి. సద్గుణాలను అలవరుచుకోవాలి. ధ్యానం, యోగం, చెయ్యాలి. ఆత్మవిచారం జరగాలి. మధుర భక్తి అనుభవంలో మునిగి తేలాలి. అదే దైవసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది.

Friday, March 10, 2023

శివోహం


*మీరు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి  అనుకుంటే తప్పకుండా   పొందుతారు.*

 *మీరు సమస్యల గురించి ఆలోచిస్తే సమస్యలకు ఆకర్షించబడుతారు.*

 *మీరు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలను పెంపొందించుకుంటే జీవితం ఎల్లప్పుడూ సానుకూలంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది.*

 *మనకు అనుకున్నది లభిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి.*

*ఎవరికైతే నేను అనే అభిమానం ఉండదో వారే సదా నిర్మాణ కర్తవ్యం చేయగలరు.*

శివోహం

శివా!అడ్డు కళ్ళ చూపు అడ్డుకుంటోంది
నిలువు కన్ను తెరిచి నిన్ను చూడ
అడ్డంకి తొలగించు నీ అండ అందించు.
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...